TTD EO PRESENTS SILKS TO KANIPAKAM_ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి, 2024 సెప్టెంబరు 15: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం టిటిడి తరఫున ఈవో శ్రీ జె. శ్యామల రావు పట్టువస్త్రాలు సమర్పించారు.
కాణిపాకంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సందర్భంగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు ఆలయ ఈవో శ్రీ గురుప్రసాద్, ఏఈవో శ్రీ విద్యా సాగర్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ను కలసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.