జులై 13 నుండి 15వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం
జులై 13 నుండి 15వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం
తిరుపతి, 2021 జులై 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జులై 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనుంది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ముఖ మండపంలో మూడు రోజుల పాటు ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా మొదటిరోజు రాత్రి 6 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వామివారిని పెద్దశేష వాహనంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.
జులై 16న పార్వేట ఉత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఏకాంతగా ఆణివార ఆస్థానం, పార్వేట ఉత్సవం ఆస్థానం నిర్వహిస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం, వాహన సేవలు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.