CHAKRASNANAM OF SRI KALYANA VENKATESWARA SWAMY PERFORMED WITH RELIGIOUS FERVOUR _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

Tirupati, June 5, 2026: The sacred Chakrasnanam of Sri Padmavati Sametha Sri Kalyana Venkateswara Swamy was conducted as per Agama traditions on Friday, marking the grand finale of the annual Brahmotsavams at Narayanavanam.

A large number of devotees participated in the holy ritual, took the sacred bath, and received the blessings of the Lord. Earlier, Pallaki Utsavam and Snapana Tirumanjanam were performed for the deities and Sudarsana Chakrathalwar.

The nine-day Brahmotsavams will conclude with Dwajavarohanam on Friday evening.

Temple officials, priests, and devotees participated in the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

పుణ్యస్నానంతో పరవశించిన భక్తజనం

నేడు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

తిరుపతి, 2026 జూన్ 05: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

పల్లకీ సేవతో ప్రారంభమైన దివ్య కార్యక్రమాలు

అంతకుముందు ఉదయం 7 గంటల నుండి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పుష్కరిణి సమీపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.

అభిషేక వైభవంలో దివ్య మంగళ దర్శనం

ఉదయం 9.15 గంటల నుండి 10.30 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.

లోకక్షేమార్థం చక్రస్నానం

తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో జరిగిన అన్ని సేవలు సఫలమై, లోకక్షేమం, సకాల వర్షాలు, ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం చక్రస్నానం నిర్వహించినట్లు ఆగమ పండితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని చక్రస్నానాన్ని దర్శించిన భక్తులు సమస్త పాప విముక్తులై, ఐశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధిని పొందుతారని విశ్వాసం.

నేడు ధ్వజావరోహణంతో ఉత్సవాలకు ముగింపు

రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి పలుకనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్రాయులు, అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది