మే 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు
మే 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు
తిరుపతి, మే 16, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మే 23వ తేదీ అంకురార్పణంతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 23వ తేదీన స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఈ మూడు రోజులపాటు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగించనున్నారు.
గృహస్త భక్తులు రూ.300/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒర రవికె, రెండు లడ్డూలు బహుమానంగా అందజేయనున్నారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన లక్ష్మీపూజ,కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు. ఆలయం వద్దనున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.