36 OFFICERS AND 267 EMPLOYEES AWARDED ON R-DAY _ 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం
టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
– 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం
– ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
తిరుపతి, 2025 జనవరి 26: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో శ్రీ వై.సతీష్ కుమార్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.
ప్రత్యేక ఆకర్షణగా టిటిడి జాగిలాల ప్రదర్శన :
టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి శ్రీ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, శింబా, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి.
ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ భవతు భారతం…”, “ అమ్మమ్మ ఏమమ్మ…”, “సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్…..” తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీవి. వీరబ్రహ్మం, డిఎల్వో శ్రీ వరప్రసాద్ రావు, సిఇ శ్రీ సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజి, సిపిఆర్వో డా.టి.రవి, అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.