KALYANA SRINIVASA DELIGHTS DEVOTEES AS NAVANEETA KRISHNA ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభపై నవనీత కృష్ణునిగా భక్తులను మురిపించిన కల్యాణ శ్రీనివాసుడు
Tirupati, June 03, 2026: As part of the annual Brahmotsavams at Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, Lord Kalyana Srinivasa blessed devotees on Wednesday evening atop the Chandraprabha Vahanam in the enchanting adornment of Navaneeta Krishna.
Radiating serenity and divine grace under the moonlit ambience, the Lord captivated devotees, who participated in the procession with Govinda namasmarana, bhajans, kolatams, and cultural performances.
The Chandraprabha Vahanam symbolizes peace, prosperity, and auspiciousness. Devotees believe that witnessing this sacred procession bestows mental peace and divine blessings.
TTD has made elaborate arrangements for the grand Rathotsavam on June 4 at 7.45 a.m., followed by Aswa Vahanam and Sri Srinivasa Kalyanotsavam in the evening.
TTD officials, temple priests, Srivari Sevaks, and a large number of devotees participated.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభపై నవనీత కృష్ణునిగా భక్తులను మురిపించిన కల్యాణ శ్రీనివాసుడు
చంద్రకాంతుల మధ్య శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించిన దివ్య దర్శనం
తిరుపతి, 2026 జూన్ 03: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు బుధవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. నవనీత కృష్ణుడు అలంకారంలో చంద్రప్రభ వాహనంపై ఊరేగిన స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.
చంద్రుని శీతల కిరణాలవలె ప్రశాంతమైన తేజస్సుతో వెలుగొందిన స్వామివారి రూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంతో గోవింద నామస్మరణలు చేస్తూ ఆనందభాష్పాలతో స్వామివారిని సేవించారు.
గోవింద నామస్మరణలతో మార్మోగిన నారాయణవనం
స్వామివారి విహార మార్గమంతా భక్తజన సందోహంతో కళకళలాడింది. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తులు “గోవిందా… గోవిందా…” నినాదాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాలు, భక్తి గీతాలతో ఉత్సవాలకు అపూర్వ శోభ చేకూరింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చంద్రప్రభ వాహన సేవ విశిష్టత
సనాతన ధర్మంలో చంద్రుడు శాంతి, సౌభాగ్యం, ఆనందం, పుష్టి ప్రసాదించే దేవతగా భావించబడతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్ర సమూహాలలో తనను చంద్రునిగా అభివర్ణించారు. సమస్త జీవజాలానికి పోషకుడైన చంద్రుడు ఔషధీశుడిగా, సస్యకారకుడిగా పూజించబడతాడు.
చంద్రుని చల్లదనం, ప్రశాంతత, ఆనందాన్ని భక్తులకు ప్రసాదించాలనే సంకల్పంతోనే స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ సేవను దర్శించడం ద్వారా మనశ్శాంతి, సౌభాగ్యం, శుభసంకల్పాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
భక్తి కోలాహలంలో దివ్య వాహనసేవ
వాహనసేవకు ముందుగా గజరాజుల శోభాయాత్ర విశేష ఆకర్షణగా నిలిచింది. అనంతరం భక్తజన బృందాలు కోలాటాలు, చెక్కభజనలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ దివ్యోత్సవం భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేసింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
జూన్ 04న రథోత్సవం – శ్రీనివాస కల్యాణ మహోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవోపేత ఘట్టమైన రథోత్సవం జూన్ 04న ఉదయం 7.45 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 8.30 గంటలకు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరగనున్నాయి.
శ్రీవారి కల్యాణోత్సవంలో రూ.1,000 చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






