LORD GOVINDARAJA BLESSES DEVOTEES ON SARVABHOOPALA VAHANAM _ సర్వభూపాల వాహనంపై దివ్య దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి
Tirupati, May 26, 2026: As part of the annual Brahmotsavams at Sri Govindaraja Swamy Temple, Lord Govindaraja Swamy blessed devotees on the divine Sarvabhoopala Vahanam on Tuesday night.
The procession commenced at 7 p.m. amid Govinda namasmarana, mangala vadyams and devotional fervour. Devotees offered haratis and had darshan of the deity along the Mada streets.
TTD Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project presented devotional and cultural programmes during the procession.
On May 27, Mohini Avatarotsavam will be held from 5 a.m. to 9 a.m., followed by the grand Garuda Vahana Seva in the night.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వలోకాల పాలకుడై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందుడు
సర్వభూపాల వాహనంపై దివ్య దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి
తిరుపతి, 2026 మే 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.
ధర్మపాలనకు దివ్య సందేశమిచ్చే సర్వభూపాల వాహనం
భగవద్భక్తితో పాలిస్తే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారనే బోధ
“సర్వభూపాల” అంటే సమస్త రాజులు, దిక్పాలకులు అని అర్థం. సర్వలోకాల అధిపతిగా శ్రీహరి అందరి హృదయాల్లో కొలువై ఉంటాడని ఈ వాహనసేవ సూచిస్తుంది. స్వామివారిని తమ భుజస్కంధాలపై మోసే దిక్పాలకులు భగవత్సేవలో నిమగ్నమై ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తారని ఈ వాహనసేవ ద్వారా ఆధ్యాత్మిక సందేశం అందుతుంది.
భక్తి సంగీతాలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
మే 27న మోహినీ అవతారోత్సవం – రాత్రికి గరుడసేవ
బుధవారం ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారోత్సవం) వైభవంగా జరుగనుంది. అనంతరం రాత్రి గరుడవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
















