SRI MAHALAKSHMI DEEPOTSAVAM SYMBOL OF PROSPERITY- శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం ఐశ్వర్యానికి ప్రతీక
Tirupati, June 19, 2026 : Sri Mahalakshmi Deepa Puja was conducted with religious fervour at Sri Ramachandra Pushkarini in Tirupati on Friday, with a large number of devotees participating.
TTD JEO Dr. A. Sarat said the programme is aimed at promoting spiritual well-being, happiness and prosperity among people. He announced that Sri Mahalakshmi Deepa Puja will be organised every second Friday of the month at different locations.
The venue echoed with Govinda Namasmarana as priests performed Vedic rituals, Deepalakshmi worship and special prayers amid the illumination of thousands of lamps.
TTD Board members, officials, Vedic scholars and devotees participated in the programme.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
– శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం ఐశ్వర్యానికి ప్రతీక
– తిరుపతిలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ
– గోవింద నామస్మరణతో మారుమోగిన శ్రీ రామచంద్ర పుష్కరిణి
– భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
తిరుపతి, 2026 జూన్ 19 ; సకల సంపదలకు అధిష్ఠాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించే పవిత్రమైన శ్రీ మహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమం శుక్రవారం తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో జీవించాలని సంకల్పించి టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తోందని చెప్పారు. ఇకపై ప్రతి నెల రెండో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, దీపం వెలిగే చోట శుభం, ఐశ్వర్యం నెలకొంటాయని అన్నారు. భక్తుల భాగస్వామ్యంతో టీటీడీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందుతోందన్నారు.
బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మీ మాట్లాడుతూ, టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తిరుపతి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, దీపం జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పారు. మహాలక్ష్మీ దీప పూజ ద్వారా కుటుంబాల్లో సుఖశాంతులు, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు.
అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మీ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, సీపీఆర్వో డాక్టర్ టి. రవి, అర్చక బృందం, వేద పండితులు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది














