జూలై 13న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

జూలై 13న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2010 జూన్ 23 : శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదిన అణివారఆస్థానం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ముందు మంగళవారమైన జూలై 13వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది.

ఆ రోజున శ్రీవారి ఆలయంలో జరిగే అష్ట‌దళ పాదపద్మారాధన సేవను రద్దు చేసారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో నాలుగు మార్లు కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో శ్రీవారి ఆలయాన్ని శుభ్రంగా కడగడం అనే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది.

గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలు, బంగారు వెండిపాత్రలు బంగారువాకిలి వరకు తెస్తారు. లోపల గోడలు పై కప్పులు అంతటా కడిగి శుభ్రంచేస్తారు.

పిదప నామంకోపు, శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, ఖిచిలిగడ్డ తదితర వస్తువుల సుగంధపరిమళ మిశ్రమాన్ని ఆలయ గోడలకు పూసి శుభ్రం చేస్తారు.

ఈ సేవను ఆర్జితంగా కూడా ప్రవేశపెట్టబడింది. రూ.3000/- లు చెల్లించి 10 మంది ఈ సేవలో పాల్గొనవచ్చును. కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగిన రోజున సర్కారు కల్యాణోత్సవం మాత్రమే జరుగుతుంది. పెద్దకల్యాణం నిర్వహింపబడదు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.