తితిదే ఉద్యోగి బి. దేవికారాణికి అరుదైన పురస్కారాలు

తితిదే ఉద్యోగి బి. దేవికారాణికి అరుదైన పురస్కారాలు

తిరుపతి, 2010 ఫిబ్రవరి 15: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో యోగా డెమాన్‌స్ట్రేటర్‌గా పని చేస్తున్న శ్రీమతి బి. దేవికారాణికి అరుదైన పురస్కారాలు లభించినది. ఇంగ్లాడులోని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి అనుబంధ సంస్థలలో ఒకటైన అమెరికన్‌ బయోగ్రాఫికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎబిఐ) ఈమెకు ‘గోల్డ్‌మెడల్‌ ఫర్‌ ఇండియా’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సంస్థ వివిధ రంగాల్లో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రతియేటా ఈ బంగారు పతకాలు ప్రధానం చేస్తుంది.

ఇందులో భాగంగా 2009వ సంవత్సరానికి దేవికారాణిని ఈ అవార్డుకు ఈ సంస్థ ఎంపిక చేసినది. మార్చి నెలలో దేవికారాణి ఇంగ్లాండు వెళ్ళి స్వర్ణపతకాన్ని అందుకోనుంది. ఇదే సంస్థ దేవికారాణికి ‘గ్రేట్‌మైండ్స్‌ ఆఫ్‌ ది 21 సెంచురి, ఎబిఐ ఫెలో, ద ఆర్డర్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషనల్‌ అంబాసిడర్‌’ పురస్కారాలను ప్రకటించినది. అలాగే కేంబ్రిడ్జి విశ్వవిధ్యాలయమునకు అనుబంధంగా ఉన్న మరో సంస్థ ఇంటర్‌నేషనల్‌ బయోగ్రాఫికల్‌ సెంటర్‌ (ఐబిసి) 21వ శతాబ్దంలో 2000 మంది మేధావులతో కూడిన జాబితాను రూపొందించింది. ఈ జాబితాల దేవికారాణి పేరు చోటు చేసుకోవడం విశేషం.

ఈమె స్వగ్రామము చిత్తూరు జిల్లా, గుడిపాల మండలంలోని చిత్తపార గ్రామము. ఈమె ఎస్‌.పి.డబ్ల్యూ. డిగ్రీ మహిళా కళాశాలలో 2004 నుంచి యోగా డెమాన్‌స్ట్రీటర్‌గా పనిచేస్తున్నారు. యోగాపై పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఒక మైనర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు యు.జి.సి. అనుమతినిచ్చారు. అంతేకాకుండా నాలుగు జాతీయ, నాలుగు అంతర్జాతీయ సదస్సులలో పేపర్‌ ఫ్రెజెంట్‌ చేశారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.