నవంబర్ 14 నుండి 16వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు

నవంబర్ 14 నుండి 16వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు

తిరుపతి, 2010 నవంబర్‌-08: తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 14వ తేది నుండి 16వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతి, తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ వెనుక గల మూడవ సత్రము ప్రాంగణమునందు ప్రతి రోజు సామూహిక భజన, భజనమండలులచే సంకీర్తన, ధార్మిక సందేశములు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధంగా నవంబర్‌ 14వ తేది సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడవ సత్రం వరకు శోభాయాత్ర, 15వ తేదిన అలిపిరి పాదాలమండపం నుండి ఉదయం 4.30 గంటలకు మెట్లోత్సవం నిర్వహిస్తారు.

ఈ మెట్లోత్సవంలో కర్నాటకలోని ముళబాగలుకు చెందిన శ్రీపాదరాజమఠం    స్వామిజీ శ్రీ 1008 కేశవనిధి తీర్థస్వామీజివారు, మంత్రాలయ మఠంకు చెందిన శ్రీ రాజగోపాలాచార్యులు, తితిదే అధికారులు పాల్గొంటారు.
     
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.