రేపటి నుండి శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 

రేపటి నుండి శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మార్చి-31, 2011: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 1 నుండి ఏప్రిల్‌ 9 వరకు వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
 
కాగా సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, పితృవాక్పరిపాలకుడు అయిన శ్రీ కోదండరామస్వామి వెలసి ఉన్న శ్రీ కోదండరామాలయం క్రీ.శ. 1480 సంవత్సరములో శ్రీ నరసింహమొదలియార్‌ నిర్మించెనని శాసనాధారాలు కలవు. ఇంతటి ప్రాచీన ప్రాభవం కలిగిన శ్రీ రామాలయంలో తితిదే ప్రతి ఏటా వార్షిక బ్రహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నది.
               
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ఏప్రిల్‌ 1న వృషభలగ్నంలో ఉదయం 9.50 గంటలకు నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవ మహోత్సవం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌ 5 రాత్రి 8.30 గం. నుండి రాత్రి 10.30 గం. వరకు గరుడసేవ,  ఏప్రిల్‌ 8న ఉదయం 7.00 గం.లకు రథోత్సవం, చివరి రోజు అయిన  ఏప్రిల్‌ 9న ఉదయం 11.00 గం.లకు చక్రస్నానం జరుగనున్నాయి. ఏప్రిల్‌ 9 రాత్రి 9.30 గం.లకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
 
కాగా  ఏప్రిల్‌ 12న శ్రీరామనవమి వేడుకలు,  ఏప్రిల్‌ 13న శ్రీసీతారామకల్యాణం,  ఏప్రిల్‌ 14న శ్రీరామపట్టాభిషేకం కూడా ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు.  ఏప్రిల్‌ 15 నుండి 17 వరకు మూడు రోజులపాటు శ్రీ రామచంద్ర ఉద్యానవన పుష్కరిణిలో తెప్పోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.   
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.