శ్రీవారి కళ్యాణం వల్లే అయోధ్య లైవ్ ఇవ్వలేకపోయాము

శ్రీవారి కళ్యాణం వల్లే అయోధ్య లైవ్ ఇవ్వలేకపోయాము

తిరుప‌తి‌‌, 2020 ఆగ‌స్టు 06: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం లైవ్ కారణంగానే అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఎస్వీ బీసీలో లైవ్ ఇవ్వలేకపోయాము. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించిన రోజు నుంచి స్వామివారి నిత్య కళ్యాణం నిరంతరాయంగా లైవ్ ఇస్తూనే ఉన్నాము. స్వామి వారి కల్యాణాన్ని ప్రతిరోజూ కోట్లాది మంది భక్తులు చూస్తారు.  

తిరుమలలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో బుధవారం నాడు శ్రీ కుప్పా శివ సుబ్రమణ్యం అవధాని అయోధ్యలో జరగనున్న రామ మందిర భూమిపూజ గురించి మాట్లాడారు. రామమందిర నిర్మాణం భూమి పూజ 12.44 గంటల సమయంలో నిర్ణయించారు. ఆ సమయంలో శ్రీవారి కళ్యాణం లైవ్ ఇవ్వాల్సి ఉన్నందున అయోధ్య కార్యక్రమం లైవ్ ఇవ్వలేకపోయారు. మధ్యాహ్నం 1 గంట న్యూస్ బులిటిన్ లో అయోధ్య కార్యక్రమం ఎస్వీబీసీ ప్రముఖంగా ప్రసారం చేసింది.  రామ మందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి యానిమేషన్ తో గురువారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఎస్వీ బీసీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంది. పాలకమండలి ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.