శ్రీ ఆండాళ్, శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మవార్ల‌కు వేడుక‌గా ఆస్థానం

శ్రీ ఆండాళ్, శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మవార్ల‌కు వేడుక‌గా ఆస్థానం
 
తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 24: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కొలువైన‌ శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఊంజల్  సేవ, వీధి ఉత్సవం, ఆస్థానం వేడుకగా నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.  శ్రీ ఆండాళ్ అమ్మవారిని విశేషంగా అలంకరించి సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు లక్ష్మీ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్త‌నాలాప‌న మ‌ధ్య‌ ఊంజల్ సేవ వేడుకగా సాగింది. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంట‌ల వరకు వీధి ఉత్సవం నిర్వహించారు. వీధి ఉత్సవంలో స్థానికులు, భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వీధి ఉత్సవం అనంతరం శ్రీ ఆండాళ్ అమ్మవారితో పాటు శ్రీ పుండరీకవ‌ళ్లి అమ్మవారిని మ‌రో తిరుచ్చిపై కొలువుదీర్చి విమాన ప్రకారంలో ప్రదక్షిణగా ఊరేగించారు. ఆ త‌రువాత‌ శ్రీ ఆండాళ్, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయాల్లో శుక్రవార ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీ‌శ్రీ‌ చిన్నజీయ‌ర్ స్వామి,  ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ‌ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.