శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ గణపతి హోమం

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ గణపతి హోమం
 
తిరుపతి, 2020 నవంబర్ 18: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన గణపతి హోమం  బుధవారం ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.
 
ఆలయ ప్రాంగణంలో  ఏర్పాటుచేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. 16 నామాలతో గణపతిని స్తుతించారు.
 
కాగా సాయంత్రం జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇచ్చారు. 
 
న‌వంబ‌రు 19వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :
 
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 19 మ‌రియు 20వ తేదీల‌లో శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం రెండు రోజుల పాటు  జరుగనుంది. న‌వంబ‌రు 20న సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
 
ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రిండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తీక మాస పూజ‌లు
 
కార్తీక మాసం సంద‌ర్బంగా టిటిడి ఆధ్వ‌ర్యంలో క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో  బుధవారం  ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు నాగులచవితి  వ్ర‌తం నిర్వ‌హించారు. 
 
ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి నాగులచవితి వ్ర‌తం విశిష్టత గురించి వివ‌రించారు. 
 
ధ్యానా‌రామంలో
 
కార్తీక మాసం సంద‌ర్భంగా అలిపిరి స‌మీపంలోని ధ్యానారామంలో  ఉద‌యం 6.00 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, విద్యార్థుల‌చే మ‌హాశివుడికి రుద్రాభిషేకం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌మ‌కం, చ‌మ‌కం, మ‌హాహ‌ర‌తి జ‌రిగాయి. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.