18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి – స్పష్టం చేసిన టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి
 
 
 
–  స్పష్టం చేసిన టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
 
 
 తిరుమల, 2021 అక్టోబ‌రు 01: తిరుమల  శ్రీవారి దర్శనానికి వచ్చే 18 ఏళ్ళు లోపు వయస్సు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకుని రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
 
 
 
తిరుమల అన్నమయ్య భవన్ వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియాతో ఈవో మాట్లాడారు. కోవిడ్ వ్యాపి నివారణలో భాగంగా, భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృస్థి లో ఉంచుకుని,  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్ వేసుకున్న  సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తేవాలని నిబంధన విధించామన్నారు. 18 ఏళ్ళ లోపు వారికి వ్యాక్సిన్ లేనందువల్ల వారు నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలని ఈవో చెప్పారు.
 
 
 
అక్టోబర్ 11 వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.  అలిపిరి నుంచి తిరుమల నడక దారిని బ్రహ్మోత్సవాలలో అందుబాటులోకి తెస్తాము.  అలిపిరిలో దాత నిర్మించిన గోమందిరం, తిరుమలలో దాత నిర్మించిన బూందీ పోటును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. బర్డ్ ఆసుపత్రిలో టీటీడీ ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె సంబంధిత వ్యాధుల చికిత్స ఆసుపత్రిని కూడా ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు.
 
 
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.