అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి

అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2019 మార్చి 01: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్ర‌వారం రాత్రి 7.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు అధికారనంది వాహ‌నంపై సోమస్కందమూర్తి ఊరేగి భక్తులను క‌టాక్షించారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.