RADHASAPTHAMI ON JAN 22_ జనవరి 22న ”తిరుమలలో రథసప్తమి వేడుకలు”

జనవరి 22న ”తిరుమలలో రథసప్తమి వేడుకలు”

తిరుపతి,  2010 జనవరి 11: ప్రతి సంవత్సరం మాఘ శుద్ధసప్తమి ”సూర్యజయంతి” నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా జనవరి 22వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలను రద్దు చేయడమైనది.

రథసప్తమి వేడుకలు ఈనెల 22వ తేదిన శ్రీవారి ఆలయంలో ఘనంగా జరుగుతాయి. ఆరోజు శ్రీవారు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఏడువాహనాల్లో తిరుమాఢ వీదులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆరోజు ఉదయం సుప్రభాతం (ఏకాంతం), అర్చన(ఏకాంతం), తోమాలసేవ(ఏకాంతం) నిర్వహించి 4.30 గంటలకు స్వామివారిని వాహన మండపంకు వేంచేపు చేసి శోభాయమానంగా అలంకరించి 5.30గంటలకు సూర్యప్రభ వాహనంపై అధిరోహింప చేస్తారు.

సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడు తిరుమాఢ వీధులలో విహరిస్తూ భక్తులకకర్పూర నీరాజనాలను అందుకొంటారు. స్వామివారు తిరువీధులలో ఈ క్రింద తెల్పిన వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనమిస్తారు.

ఉదయం 5.30 గంటలకు – సూర్యప్రభవాహనం
ఉదయం 9గంటలకు – చిన్నశేష వాహనం
ఉదయం 11గంటలకు – గరుడ వాహనం
మధ్యాహ్నాం 1గంటలకు – హనుమంతవాహనం
మధ్యాహ్నాం 2గంటలకు – చక్రస్నానం
సాయంత్రం 4గంటలకు – కల్పవృక్షవాహనం
సాయంత్రం 6గంటలకు – సర్వభూపాలవాహనం
సాయంత్రం 8గంటలకు – చంద్రప్రభవాహనం
ఈ రథసప్తమి వేడుకలను అర్థబ్రహ్మోత్సవమని, ఒకరోజు బ్రహ్మోత్సవమని భక్తులు అంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.