Sriman Veturi Prabhakara Sastry 62nd Vardhanthi Festivals_ ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో పరిశోధనలు సాగించాలి: తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
written by Acharya Manasa Chennappa.
ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో పరిశోధనలు సాగించాలి :తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 ఆగస్టు 29: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో విద్యార్థులు తెలుగు భాష, సాహిత్య రంగాల్లో విస్తృతంగా పరిశోధనలు సాగించాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తితిదే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలోని తెలుగు విభాగం సెమినార్ హాలులో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 62వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
తితిదే ఎడిటర్ ఇన్ చీఫ్, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ప్రత్యేకాధికారి ఆచార్య రవ్వా శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ప్రభాకరశాస్త్రి వర్ధంతి రోజు తెలుగు భాషా దినోత్సవం రావడం విశేషమన్నారు. అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభాకరశాస్త్రి ఎంతగానో కృషి చేశారని, ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి తితిదేకి అందజేశారని వివరించారు. విద్యార్థులు పరీక్షల్లో మార్కుల కోసం పాకులాడకుండా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనాంశాలుగా మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆచార్య మసన చెన్నప్ప రచించిన ”శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయసూచిక” అనే గ్రంథాన్ని ఈఓ ఆవిష్కరించారు.
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ప్రత్యేకాధికారి ఆచార్య రవ్వా శ్రీహరి ప్రసంగిస్తూ ప్రభాకరశాస్త్రి తెలుగు సాహిత్యానికి, తితిదేకి చేసిన సేవలకు గుర్తింపుగా వాఙ్మయపీఠం స్థాపించి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతేగాక ఆయన ఆలోచనలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రతిఏటా ఆయన రచనలను ముద్రించి ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. ప్రభాకరశాస్త్రిని కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా, తొలి తెలుగు పదమైన ‘నాగబు’ను గుర్తించిన పరిశోధకుడిగా, తాళపత్ర గ్రంథ వివరణ రచయితగా, అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడిగా, అన్నమాచార్య ఉత్సవాల ప్రథమ ప్రారంభకుడిగా ఆయన అభివర్ణించారు.
ముందుగా ఉదయం 9.30 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యకక్షులు ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఉదయం వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సుప్రసన్న ‘ప్రభాకరుల యోగసాధన’ అనే అంశంపై, మైసూర్లోని మైసూరు విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య సుందరం ‘ప్రభాకరుల ప్రబంధరత్నావళి’ అనే అంశంపై ఉపన్యసించారు. మధ్యాహ్నం నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య ఆకురాతి పున్నారావు ‘ప్రభాకరుల భాషాపరిశోధన’ అనే అంశంపై, హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పి.రాములు ‘ప్రభాకరుల పరిశోధన వాఙ్మయం’ అనే అంశంపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ప్రభాకరశాస్త్రి శిష్యులు శ్రీ సచ్చిదానందం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, ఎస్వీయూ తెలుగు విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.