ఆగష్టు 5వ తేది శ్రావణపూర్ణిమ పండుగ

ఆగష్టు 5వ తేది శ్రావణపూర్ణిమ పండుగ

తిరుపతి, జూన్‌-8, 2009: ఆగష్టు, 5వ తేది బుధవారం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రీతి పాత్రమైన శ్రావణపూర్ణిమ పండుగను రాష్ట్రంలో 144 ముఖ్యమైన ప్రాంతాలలో మరియు కేరళ రాష్ట్రం గురువయ్యూరు పుణ్యక్షేత్రములో ఘనంగా నిర్వహిస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి అన్నారు. సోమవారం నాడు శ్రావణపూర్ణిమ పండుగ ఏర్పాట్లు గురించి తితిదే అధికారులతో తితిదే పరిపాలనా భవనంలో ఆయన సమీక్షించారు.

ఈ సందర్బముగా శ్రీ రమణాచారి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా జోనల్‌ అధికారులను, నోడల్‌ అధికారులను నియమించామని, వీరందరూ స్థానిక అధికారులతో, భక్తులతో ఆధ్యాత్మిక సంఘాలతో చర్చించి శ్రావణపూర్ణిమ కార్యక్రమాలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. శ్రావణపూర్ణిమ జరిపే అన్నీ ప్రాంతాలకు శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచి పూజలు జరిపిన కంకణాలను, అమ్మవారి కుంకుమ పాకెట్లను, పుస్తక ప్రసాదాన్ని పంపే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రావణపూర్ణిమ జరిగే పవిత్ర స్థలములో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ వి.శేషాద్రి, డి.పి.పి. సెక్రటరీ శ్రీ విజయరాఘవాచార్యులు, ఎస్‌.ఇ. శ్రీ రమేష్‌రెడ్డి, ముఖ్యగణాంకాధికారి శ్రీ బాలాజి తదితరులు పాల్గోన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.