ఏప్రిల్‌ 11న తితిదే ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

ఏప్రిల్‌ 11న తితిదే ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

తిరుపతి, ఏప్రిల్‌  09, 2013: శ్రీ విజయనామ సంవత్సరం ఉగాది సంబరాలను ఏప్రిల్‌ 11న ఘనంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం పంచాంగశ్రవణం, వస్త్రసమర్పణ నిర్వహించనున్నారు.
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉగాది సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు సభ నిర్వహించనున్నారు. తితిదే అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు హాజరవుతారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.

మహతి కళాక్షేత్రంలో…

తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో విజయనామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్‌ 11న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు డాక్టర్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాద వితరణ ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు ప్రముఖ కవులతో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.