కార్తీక మహా దీపోత్సవం ను విజయవంతం చేద్దాం- బీచ్ లో వేదిక స్థల పరిశీలన చేసిన టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

కార్తీక మహా దీపోత్సవం ను విజయవంతం చేద్దాం

– బీచ్ లో వేదిక స్థల పరిశీలన చేసిన టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

– ఏర్పాట్లపై సమీక్షలో పలు సూచనలు

తిరుపతి 10 నవంబరు 2022: విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో నవంబరు 14 వ తేదీ టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు,దాతలు, శ్రీవారి సేవకులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపు నిచ్చారు.
ఆర్ కె బీచ్ లోని కాళిక అమ్మవారి ఆలయం ఎదురుగా బీచ్ లో కార్తీక మహాదీపోత్సవం నిర్వహించే స్థలాన్ని గురువారం ఆమె అధికారులతో కలసి పరిశీలించారు. వేదిక నిర్మాణం , బారికేడ్లు, భక్తులు వచ్చీ పోయేందుకు ఏర్పాటు చేయాల్సిన మార్గాల గురించి అధికారులతో ఆమె చర్చించారు. భక్తుల భద్రత , దీపాల ఏర్పాటు,పాసుల జారీ, ప్రసాద వితరణ అంశాలపై శ్రీమతి సదా భార్గవి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం టీటీడీ కళ్యాణమండపంలో దాతలు, నిర్వాహకులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, 2020లో లోకక్షేమం, హిందూ ధార్మిక ప్రచారం కోసం టీటీడీ కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే 14వ తేదీ విశాఖ లో మూడోసారి ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిందన్నారు. గత ఏడాదికంటే మరింత ఘనంగా దీపోత్సవం నిర్వహణకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి 2500 పాసులు జారీ చేస్తున్నామని ఒక పాసుమీద నలుగురిని అనుమతిస్తామన్నారు. 14వ తేదీ ఉదయం కళ్యాణమండపం నుంచి వేదిక వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వెళతామని చెప్పారు. సాయంత్రం 5-30 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమం అయ్యాక కూడా విశాఖలో భక్తులు మరచిపోలేనంత ఘనంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు .

టీటీడీ సివి ఎస్ వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వి బిసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి, దాతలు శ్రీ పైడా కృష్ణప్రసాద్, శ్రీ గ్రంధి రాజేష్ , శ్రీ సీతారాం, శ్రీ రాజశేఖర్ తో పాటు కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది