జనవరి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు 

జనవరి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు

తిరుపతి, జనవరి-16,2013: తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో జనవరి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్టు దాససాహిత్య ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌ శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఒక ప్రకటనలో తెలిపారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల తితిదే మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.
 
జనవరి 26,27 తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు భజన మండలులతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతపు భజన మండలులతో సంకీర్తన ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.00 గంటల వరకు ధార్మిక సందేశం కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి 8.30 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
జనవరి 26వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం చెన్నైకి చెందిన దాససాహిత్య ప్రాజెక్టు యువ కలాకారులచే ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.  
 
అలిపిరి పాదాల మండపంలో జనవరి 28వ తేదీ సోమవారం ఉదయం 4.30 గంటలకు ఉత్తరాది మఠం పీఠాదిపతులు శ్రీ సత్యాత్మతీర్థులు మరియు అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతమును ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో మనము నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అనిష్టములు తొలగి సర్వాభీష్టములు సిద్ధిస్తాయి.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.