MASS OATH BY TTD EMPLOYEES IN TIRUPATI AND TIRUMALA _ తిరుమల, తిరుపతిలో తితిదే ఉద్యోగుల సామూహిక ప్రమాణ స్వీకారం
తిరుమల, తిరుపతిలో తితిదే ఉద్యోగుల సామూహిక ప్రమాణ స్వీకారం
తిరుపతి, ఆగస్టు 25: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువులో హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ హిందూ ధర్మ రక్షణకు కట్టుబడి ఉంటామని, అన్యమత పాటింపు, ప్రచారం చేయబోమని తితిదే ఉద్యోగులు శనివారం తిరుమల, తిరుపతిలో సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ప్రతి శనివారం జరిగే ఉద్యోగుల ప్రార్థన కార్యక్రమంలో భాగంగా కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఉద్యోగులతో ఈ ప్రమాణం చేయించారు.
ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి కొలువులో ఉద్యోగిగా సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మసుకృతమని, ఉద్యోగ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ వేలాదిగా తిరుమలకు వచ్చే భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా నీతి, నిజాయితీతో నడుచుకుంటామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. జి.ఓ.ఎం.ఎస్.నెంబరు.1060, తేదీ.24-10-1989లోని రూలు9(6)ను అతిక్రమించబోమని, అన్యమతం పాటించడం గానీ, ప్రచారం గానీ చేసినట్టు తితిదే యాజమాన్యం దృష్టికి వచ్చినట్టయితే తగిన క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహిస్తామని శ్రీ వేంకటేశ్వరస్వామివారి చిత్రపటం ముందు ప్రమాణం చేస్తున్నామని ఉద్యోగులు తెలియజేశారు.
ఉద్యోగులు సామూహిక ప్రమాణం అనంతరం, సామూహిక ప్రార్థన, శాంతి మంత్రం, జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.