రథసప్తమికి తితిదే స్థానిక ఆలయాల ముస్తాబు 

రథసప్తమికి తితిదే స్థానిక ఆలయాల ముస్తాబు

తిరుపతి, ఫిబ్రవరి 16, 2013  : తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు రథసప్తమి పర్వదినానికి ముస్తాబయ్యాయి. ఇందుకోసం ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. చలువ పందిళ్లు, పుష్పాలంకరణలు, రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని తితిదే స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన శ్రీవారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.
 
ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మొట్టమొదటిసారిగా రథసప్తమి వేడుక జరుగనుంది.
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు అమ్మవారు సప్తవాహనాలను అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిస్తారు.
 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు.
 
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది.
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
 
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
 
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
    
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.