వైభవంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

వైభవంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 25, 2013  : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
 
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణి వద్ద గల నీరాటమండపానికి ఉత్సవమూర్తులను వేంచేపు చేయనున్నారు.
 
విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఏడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించనున్నారు. అనంతరం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులలో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.