శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 07:  తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దుర్గ‌రాజు,  సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌,  ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.