– హిందూ మ‌త ద్వేషులు చేస్తున్న ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల ప్ర‌చారాన్ని భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్దు- డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

టీటీడీ న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌పై శ్వేత ప‌త్రం

– 15 వేల 900 కోట్లు జాతీయ బ్యాంకుల‌లో డిపాజిట్‌

– హిందూ మ‌త ద్వేషులు చేస్తున్న ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల ప్ర‌చారాన్ని భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్దు

– డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 న‌వంబ‌రు 05: శ్రీ‌వారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌ను జాతీయ బ్యాంకుల‌లో డిపిజిట్ చేసిన‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు .తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. కిషోర్ – కావాలి

ప్ర‌శ్న – త్వ‌ర‌లో కాల ప‌రిమితి ముగియ బోతున్న రూ.5 వేల కోట్ల డిపాజిట్లను ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం నిజమేనా.

ఈవో – టీటీడీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌నికి డ‌బ్బులు ఇవ్వ‌లేదు, భ‌విష్య‌త్లులో కూడా ఇవ్వ‌దు. చైర్మ‌న్‌, టీటీడీ మీద బుర‌ద చ‌ల్ల‌డానికి హిందూ మ‌త ద్వేషులు ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డుతున్నారు. టీటీడీ చైర్మ‌న్‌, బోర్డు అధికారులు ఇంత వ‌ర‌కు ఏ త‌ప్పు చేయ‌లేదు, ఇక‌మీద కూడా చేయ‌రు. రాష్ట్ర‌ ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయ‌లేదు. ఇప్ప‌టిదాకా రూ.15 వేల 900 కోట్లు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇక‌పై కూడా వ‌డ్డీ ఎక్కువ‌గా ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం.
హిందూ మ‌త ద్వేషులు చేస్తున్న ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల‌ను భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. టీటీడీ న‌గ‌దు, బంగారం బ్యాంక్ డిపాజిట్లపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తాం.

2. హనుమంత్ ప్రసాద్ – హైదరాబాద్, తిరుమల్ రావు – నల్గొండ

ప్రశ్న- మా కాలనీలోని రామాలయంలో ధూప, దీప, నైవేద్యాలు భారంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐదువేలు సరిపోవడం లేదు. టిటిడి తరఫున ఆర్థిక సహాయం అందించగలరు. మాకాల‌నీల‌లో కళ్యాణ మండపం నిర్మించేందుకు చర్యలు తీసుకోండి.

ఈవో – టీటీడీ అధికారులు పరిశీలించి, శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాం.
క‌ల్యాణ మండ‌పం నిర్మాణానికి నిబంధ‌న‌ల మేర‌కు అధికారులు ప‌రిశీలిస్తారు.

3. పెంచలయ్య – నెల్లూరు

ప్రశ్న- మా గ్రామంలో దేవాలయం నిర్మాణానికి టీటీడీ ఆమోదం తెలిపింది. తర్వాత రద్దు చేశారు

ఈవో – ఆల‌య నిర్మాణానికి నిబంధనలను పరిశీలిస్తాం.

4. సుభాషిణి – చెన్నై

ప్రశ్న- వయోవృద్ధులకు స‌హాయ‌కులుగా వ‌చ్చే రక్తసంబంధీకులు 50 సంవత్సరాలు పైబ‌డి ఉండాల‌నే నిబంధ‌న పెట్టారు. వ‌యోవృద్ధుల‌ను ఆల‌యంలో తోసేస్తున్నారు.

ఈవో – వ‌యోవృద్ధుల‌ను శ్రీవారి సేవకులు మాత్రమే తీసుకుని వెళ్ళి ద‌ర్శ‌నం చేయించేలా చర్యలు తీసుకుంటాం.

5. రాంబాబు – ఖమ్మం

ఈవో – స్వామివారికి వెండి కిరీటం ఇవ్వాలనుకుంటున్నాం.

ఈవో – శ్రీవారికి వెండి కిరీటం వాడటం లేదు. మీ నుండి వెండి కిరీటం విరాళంగా తీసుకుని టిటిడి అనుబంధాలయాల్లో వినియోగించే విషయం పరిశీలిస్తాం.

6. సాంబయ్య – వరంగల్

ప్రశ్న- విఐపి బ్రేక్ దర్శనాలకు లెటర్ ఎప్పుడు ఇవ్వాలి.

ఈవో – ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల లోపల లెటర్ ఇవ్వాలి. ఆరున్నర గంటల త‌రువాత మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. తర్వాత దర్శనం టికెట్లు పొందాలి.

7. బాలాజీ – చెన్నై

ప్రశ్న- మేము చెన్నై నుండి ఎలక్ట్రికల్ బైక్ లో తిరుమల వచ్చాం. అక్కడ చార్జింగ్ పాయింట్లు లేవు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో చార్జీంగ్ పాయింట్లు ఏర్పాటు చేయగలరు.

ఈవో – ప్రస్తుతం అలిపిరి, తిరుమలలో టీటీడీ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. భ‌క్తులు అవ‌స‌ర‌మైతే భ‌క్తులు వినియోగించుకోవ‌చ్చు. త్వరలో ఏపిఎస్ ఆర్టీసి, హెచ్‌సిఎల్‌ వారితో సమన్వయం చేసుకొని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.

8. అశోక్ కుమార్ – చెన్నై

ప్రశ్న- అలిపిరి నడక మార్గంలో తనిఖీల సమయంలో సిబ్బంది భ‌క్తుల‌ను అవమానిస్తున్నారు.

ఈవో – భద్రత కారణాలు రీత్య అలిపిరి, శ్రీ‌వారిమెట్టు వ‌ద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. భ‌క్తుల ప‌ట్ల అవ‌మానంగా ప్ర‌వ‌ర్తించ కుండా చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ సిబ్బంది మిమ‌ల్ని అవ‌మానించి ఉంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను.

9. తేజ – బెంగళూరు

ప్రశ్న- వృద్ధులకు, చిన్న పిల్లలకు నేరుగా దర్శనం కల్పించండి.

ఈవో – ప్ర‌తి రోజు ఒక గంట వృద్ధులకు, దివ్యాంగుల‌కు, చిన్న పిల్లల త‌ల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తున్నాం. ఈ టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని తిరుమ‌ల‌కు రావాలి.

10. రాజేశ్వరరావు – కరీంనగర్

ప్రశ్న- శ్రీవారి సేవలో లడ్డు ప్ర‌సాద సేవను తీసేసారు. తిరిగి ప్ర‌వేశ పెట్టండి.

ఈవో – లడ్డు ప్ర‌సాద సేవ చేయ‌డానికి అనుభ‌వం క‌లిగి, చేయగలవారు ఉంటే పరిశీలిస్తాం.

11. యువరాజు – తిరుపతి

ప్రశ్న- శ్రీనివాసం వ‌స‌తి స‌మూదాయాల వ‌ద్ద రోడ్డు దాటడానికి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జ్ ఏర్పాటు చేయ‌గ‌ల‌రు.

ఈవో – తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీకి తెలియ‌జేసి స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించే ఏర్పాటు చేస్తాం.

12. సూర్యనారాయణ – విజయవాడ, మల్లేశ్వరరావు – నిర్మల్

ప్రశ్న- నడిచి వెళ్లే భక్తుల‌కు దివ్యదర్శనం టోకెన్లు ఎప్పటినుంచి ప్రారంభిస్తారు.

సర్వదర్శనం ఎస్ ఎస్ డి టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయగలరు

ఈవో – న‌వంబర్ 1వ తేదీ నుండి అలిపిరి వద్ద గల శ్రీదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజస్వామి స‌త్రాల వద్ద ఎస్ ఎస్‌డి టోకెన్లు జారీ చేస్తున్నాం. సోమవారం నుండి గురువారం వరకు 15 వేలు, శుక్ర, శని, ఆదివారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం. ఇప్పటికే రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టోకెన్లు ఆన్‌లైన్‌లో ఉంచ‌డం జరిగింది.

13. శ్రీనాథ్ – తూర్పుగోదావరి

ప్రశ్న- శ్రీవారి సేవను ఆఫ్ లైన్ కూడా ఇవ్వగలరు.

ఈవో – శ్రీ‌వారిసేవ‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. శ్రీ‌వారి సేవ స్వ‌చ్ఛంద సేవ కావున సేవ‌కులు ఎవ‌రికి డ‌బ్బు ఇవ్వ‌కండి.

14. సాంబ‌మూర్తి –

ప్ర‌శ్న – మాగ్రామంలో శ్రీనివాస కళ్యాణం చేయాలని ఉంది. నాకు అంత ఆర్థిక స్థోమత లేదు.

ఈవో – శ్రీనివాస కళ్యాణం నిర్వ‌హించ‌డానికి రెండు ప‌ద్ధ‌తులు ఉన్నాయి. ఒకటి దాతల సహకారంతో, రెండవది టీటీడీ చేయడం, మా అధికారులు పరిశీలించి త‌గిన నిర్ణయం తీసుకుంటారు.

15. ఆనంద్ – ముంబై

ప్రశ్న- దర్శనానికి 9 గంటలపాటు వేచి ఉండవలసి వస్తోంది. మాకు సమయ నిర్దేశిత దర్శనం కల్పిస్తే ఇతర ఆలయాలను దర్శించుకుంటాము.

ఈవో – న‌వంబ‌రు 1వ తేదీ నుండి తిరుపతిలో ఎస్ ఎస్‌డి టోకెన్లు మూడు ప్రాంతాల్లో జారీచేస్తున్నాం.

16. శివగోపాల్ – కర్నూలు

ప్ర‌శ్న – నారాయణగిరి ఉద్యాన‌వ‌నాల‌లో నిర్మించిన విధంగా షెడ్ లను బయట క్యూలైన్ల వద్ద కూడా నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈవో – ప్రతి రోజు తిరుమ‌ల‌కు వ‌చ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కాబ‌ట్టి తిరుమ‌ల మొత్తం షెడ్లు నిర్మించ‌లేము. అందుకే తిరుప‌తిలో నవంబరు 1వ తేదీ నుండి ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం.

17. లక్ష్మీనారాయణ – రాజమండ్రి

ప్రశ్న- ఎస్వీబిసి లో ప్రసారమయ్యే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఈ కార్య క్ర‌మాల‌ను వీక్షిస్తున్నాము. చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.10 వేల రూపాయలు విరాళం ఇచ్చిన వారికి కూడా బ్రేక్ దర్శనం కల్పించగలరు.

ఈవో – చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి ఇప్పటికే లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నాం. రూ.10 వేలు విరాళం ఇచ్చే దాత‌ల‌కు దర్శనం కల్పించలేము.

18. అప్పారావు గుడివాడ

ప్ర‌శ్న – కరోనా సమయంలో అద్భుతంగా పారాయణం చేశారు. వయోవృద్ధులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.

ఈవో – ప్రతి రోజు వ‌యోవృద్ధుల‌కు ప్ర‌త్యేకంగా ఒక గంట దర్శనం కల్పిస్తున్నాము ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చు

19. రజ‌ని – చెన్నై, వేంకటేశ్వర్లు – బద్వేల్

ప్ర‌శ్న – శ్రీవారి సేవ చివరి రోజు ఆలయ డ్యూటీ వచ్చింది, అందులో లాగేస్తున్నామని భ‌క్తులు కోపడ్డారు.

ఈవో – వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్ లలో గంటల తరబడి శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తులు ఆల‌యంలోకి రాగానే ఎక్కువ స‌మ‌యం స్వామివారిని చూడాల‌నుకుంటారు. దీని వ‌ల్ల క్యూ కాంప్లెక్స్‌ల్లో భ‌క్తుల‌కు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తుంది. కావున శ్రీ‌వారి సేవ‌కులు స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించాలి.

20. జయలక్ష్మి – కర్నూలు

ప్ర‌శ్న – ప్రతి నెల విడుదల చేసే ఆర్జిత‌ సేవలు లక్కీ డిప్‌లో తగలడం లేదు. నేను సంగీతం టీచర్ ని, నాదనీరాజన వేదిక‌పై పాడేందుకు అవకాశం కల్పించగలరు.

ఈవో – శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్‌ చేసుకోవచ్చు, అలాగే తిరుమలలో కూడా ముందు రోజు రిజిస్టర్ చేసుకుని లక్కీ డిపోలో పాల్గొన‌వచ్చు. నాద‌నీర‌జ‌నం వేదిక‌పై పాడ‌టానికి అవ‌కాశం క‌ల్పిస్తాం.

21. ఆంజనేయులు – విజ‌య‌వాడ‌

ప్ర‌శ్న – తిరుప‌తిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పిల్ల‌ర్ల‌పై స్వామివారి నామాలు ఏర్పాటు చేసి వాటి మీద వాహ‌నాలు తీరుగుతున్నాయి. ఇది మంచిదేనా.

ఈవో – ఆగమపండితులతో సంప్రదించి చ‌ర్య‌లు తీసుకుంటాం.

22. వెంకటేశ్వరరావు – ఏలూరు

ప్ర‌శ్న – తిరుమ‌ల‌లో మాకు భజనలు చేసేందుకు అవకాశం కల్పించండి.

ఈవో – అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొనేందుకు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోండి.

23. శ్రీకాంత్ – తిరుపూరు

ప్ర‌శ్న – శ్రీవారి సేవ మూడు రోజులు ఉండేది ఇప్పుడు తీసేశారు.

ఈవో – ఏడు రోజుల సేవ‌కు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మూడు రోజుల సేవను పరిశీలిస్తాం.

25. వేణుగోపాల్ హైదరాబాద్

ప్ర‌శ్న – గదుల‌ బుకింగ్‌కు సంబంధించిన స్కానింగ్‌ను తిరుమ‌ల ఆర్‌టిసి బ‌స్టాండ్‌లో ఏర్పాటు చేయండి. సమస్యలను తెలిపేందుకు డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కాకుండా వేరే మార్గాలను ప్రవేశపెట్టండి. ఆర్జిత‌ సేవల లక్కి డిప్‌కు ఆధార్ కార్డు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోండి. దాత‌ల‌కు అందించే స‌దుపాయాల‌ను త‌గ్గిస్తున్నారు.

ఈవో – అలిపిరి వద్ద గదుల స్కానింగ్ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఆర్‌టిసి బ‌స్టాండ్ వ‌ద్ద కూడా ఏర్పాటు చేసే విష‌యం పరిశీలిస్తాం. స‌మ‌స్య‌ల‌ను ఈమెయిల్‌, కాల్ సెంటర్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. దాత‌ల‌కు అందించే స‌దుపాయాల‌ను త‌గ్గించ‌డం లేదు.

26. ప్రసాదరావు – హైదరాబాద్

ప్ర‌శ్న – ఎస్వీబిసి కార్యక్రమాలు బాగున్నాయి. భగవద్గీతలోని శ్లోకాలు సిడిల‌ రూపంలో అందించండి.

ఈవో – భగవద్గీత శ్లోకాలను,వాటి తాత్ప‌ర్య‌ల‌ను త‌యారు చేసి యూట్యూబ్ లో ఉంచాము. ఈ – మెయిల్ చేస్తే సిడిలు కూడా పంపుతాం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.