ADIBHATLA’S 148TH BIRTH ANNIVERSARY CELEBRATED BY TTD _ సంగీత, సాహిత్య, నాట్యకళల మేళవింపే హరికథ : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
సంగీత, సాహిత్య, నాట్యకళల మేళవింపే హరికథ : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 ఆగస్టు 20: సంగీతం, సాహిత్యం, నాట్యకళల మేళవింపే హరికథ కళారూపమని, కాబట్టే సామాన్య జనుల నుండి ఇప్పటికీ అమితమైన ఆదరణ లభిస్తోందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం శ్రీ ఆదిభట్ల నారాయణదాసవర్యుల 148వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 7.30 గంటల నుండి రాత్రి 10.15 గంటల వరకు అహోరాత్ర హరికథాగాన యజ్ఞం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ నారాయణదాసవర్యులు సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని చైతన్యవంతం చేయ డానికి తన వంతు కృషి చేశారని కొనియాడారు. ఈయన ఎనిమిది భాషలు మాట్లాడేవారని, సంగీత, సాహిత్యం, నాట్య రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరిచారని వివరించారు. సాక్షాత్తు సరస్వతి దేవి పురుషరూపం ధరించిందా అన్నట్టు ఉండేవారని పేర్కొన్నారు. సంగీత విద్యార్థులు ఈయనను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో భక్తిభావం నింపాలన్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ హరికథ గొప్పదనం గురించి వివరించారు. పురాతన కాలంలో కళాకారులను పోషించిన రాజులు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. సైద్ధాంతిక వైభవం గల తితిదే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుంటుందన్నారు.
పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ టీవీలు, రేడియోలు లేని రోజుల్లో హరికథల ద్వారానే హిందూ ధర్మప్రచారం జరిగేదన్నారు. హరిదాసులు గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపి నిజమైన ప్రజాసేవ చేస్తున్నారని పేర్కొన్నారు. హరిదాసులు ప్రజల నాడి తెలుసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ హరికథాగానం చేయాలన్నారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి డాక్టర్ హెచ్.ఎస్.బ్రహ్మానంద ప్రసంగిస్తూ నిజమైన ధార్మిక ప్రచారం హరికథ ద్వారానే సాధ్యమన్నారు. హరిదాసులు నిరంతరం గ్రంథ పరిశోధన చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.
మొదట ఉదయం 7.30 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల నుండి అధ్యాపకులు, విద్యార్థులు శ్రీ ఆదిభట్ల నారాయణదాస చిత్రపటంతో మహతి కళాక్షేత్రం వరకు నగర సంకీర్తన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు యదార్థ రామాయణ కీర్తనలను బృందగానం చేశారు. అనంతరం ఉదయం 9.15 గంటలకు ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆదిభట్ల నారాయణదాసవర్యులు రచించిన సావిత్రీ చరిత్రము, శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాస రచించిన శ్రీకృష్ణుని రాయబారము, బ్రహ్మశ్రీ పరిమి సుబ్రమణ్యశర్మ రచించిన సతీ తులసి హరికథా గ్రంథాలను ఈఓ ఆవిష్కరించారు.
అహోరాత్ర హరికథా గాన యజ్ఞంలో భాగంగా ఉదయం 10.15 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ జి.చంథ్రేఖర భాగవతులు ‘భీష్మ విజయం’, మధ్యాహ్నం 12.15 గంటలకు గుంటూరుకు చెందిన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి ‘శ్రీకృష్ణరాయబారం’ హరికథలు వినిపించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతికి చెందిన కుమారి పొలకల సుందరాంబ భాగవతి ‘సతీ తులసి’, సాయంత్రం 4.15 గంటలకు విజయవాడకు చెందిన శ్రీ తుములూరు లక్ష్మణశాస్త్రి భాగవతులు ‘భక్త మార్కండేయ’ హరికథలు వినిపించారు. సాయంత్రం 6.15 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి టి.లక్ష్మీరాజ్యం భాగవతి ‘జానకీ శపథం’, రాత్రి 8.15 గంటలకు తెనాలికి చెందిన శ్రీ చందూ భాస్కరరావు భాగవతులు ‘గజేంద్ర మోక్షణం’ హరికథలు వినిపించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎ.సూర్యకుమారి, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్, తితిదే ముఖ్య గణాంకాధికారి శ్రీ కె.ఎస్.ఎ.శేషసాయి శైలేంద్ర, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి దీక్షితులు, కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పురప్రజలు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.