Condolence meeting by TTD Trust Board on the demise of Dr Y.S.Rajasekhar Reddy _ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతికి ఘననివాళి
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతికి ఘననివాళి
తిరుపతి, సెప్టెంబర్- 14, 2009: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతికి చింతిస్తూ తితిదే పాలకమండలి ఆయనకు ఘననివాళి అర్పించిరి.
సోమవారం తిరుపతి తితిదే పరిపాలనభవనంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సంతాపసభ జరిగింది. ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్ చిత్రపటానికి తితిదే ఛైర్మన్ ఆదికేశవులునాయుడు, ఇ.ఓ ఐ.వై.ఆర్.కృష్ణారావు, పాలకమండలి సభ్యులు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఛైర్మన్ డి.కె.ఆదికేశవులనాయుడు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి ఆయనకు సన్నిహితుడుగా వుండేవాడినని గుర్తుచేసుకొన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని చివరిసారిగా ఆయన చాంబర్లో కలసినపుడు తిరుమలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి త్వరిత గతిన దర్శనభాగ్యం కల్పించామని తమకు సూచించారని చెప్పారు. తితిదే అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేసారని కొనియాడారు. వై.ఎస్.ఆర్ జ్ఞాపకార్థం తిరుపతి పట్టణంలో స్వంతఖర్చులతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అనంతరం తితిదే కార్యనిర్వహణాధికారి ఐ.వై.ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగ ఉన్నప్పుడు తాను కడప జాయింట్ కలెక్టర్గా పనిచేసేవాడినని గుర్తచేసుకొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తరచూ తనను కలిసేవారని పేర్కొన్నారు. ఆయన పాలనలో ఐదు ఏళ్ళు ఆర్థిక శాఖలో పనిచేసి తితిదే ఇ.ఓగా రావడం ఆయన సూచన మేరకే జరిగిందని చెప్పారు. క్రమశిక్షణకు, పరిపాలన దక్షతకు వై.ఎస్.ఆర్ మారుపేరని కొనియాడారు. అనంతరం పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి రాష్ట్రంలో ఇష్టమైన ప్రదేసం మన తిరుపతియేనని అన్నారు. తితిదే అభివృద్ధికి, ఉద్యోగస్తుల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసిన మహనీయుడు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు. ఆయన మరణవార్త విని 400 మందికి పైగా చనిపోయారంటే ప్రజలు ఆయనను ఎంతగా అభిమానించారో అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే పాలకమండలి డా||ఎం.అంజయ్య, శ్రీసత్యనారాయణ, శ్రీసుబ్రమణ్యం, శ్రీయాదయ్య తితిదే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.