EO INAUGURATES AYINA MAHAL IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో అద్దాల మండపాన్ని ప్రారంభించిన తితిదే ఈఓ
శ్రీ కపిలేశ్వరాలయంలో అద్దాల మండపాన్ని ప్రారంభించిన తితిదే ఈఓ
తిరుపతి, మార్చి 18, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఇటీవల నిర్మించిన అద్దాల మండపాన్ని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం ఉదయం ప్రారంభించారు. తిరుపతి మాజీ శాసనసభ్యులు శ్రీ వెంకటరమణ విరాళంగా ఇచ్చిన నిధులతో ఈ మండపాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ తితిదే అన్ని స్థానిక ఆలయాలను ఆగమోక్తంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. కపిలతీర్థంలో భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి గదులు, స్నానపుగదులు, లాకర్ల ఏర్పాటుకు అవసరమైన భవనాల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతి కోరినట్టు వివరించారు. అన్ని స్థానిక ఆలయాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్కుమార్, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.