తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

ఫిబ్రవరి 15, తిరుపతి 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా శనివారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.