ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం

ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం

తిరుపతి, మార్చి 22, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ లక్ష్మణ సమేత శ్రీసీతారాముల వారికి శుక్రవారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు కోదండరామాలయం నుండి లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట(ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 8.30 నుండి 10.00 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం, ఆస్థానం, ఊంజల్‌సేవ నిర్వహించిన అనంతరం ఊరేగింపు ప్రారంభమైంది. రాత్రి 9.00 గంటలకు ఈ ఊరేగింపు శ్రీ కోదండరామాలయానికి చేరుకోనుంది.

శ్రీకోదండరామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించేవారు. 1910వ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.