‘METLOTSAVAM’ at Aliperi _ వైభవంగా మెట్లోత్సవం
వైభవంగా మెట్లోత్సవం
తిరుపతి, ఏప్రిల్ 06, 2013: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 510 వర్ధంతిని పురస్కరించుకుని తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్ ప్రసంగిస్తూ తాళ్లపాక అన్నమయ్య శ్రీవారిలో ఐక్యమైన బహుళ ద్వాదశి ముందురోజు మెట్లోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. నామసంకీర్తనం శ్రీవారికి అత్యంత ఇష్టమని, అన్నమయ్య ఈ ప్రక్రియ ద్వారానే స్వామివారి సాన్నిధ్యానికి చేరుకున్నారని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనల్లో నాలుగే వేదాల సారం ఉందన్నారు. స్వామివారి వైభవాన్ని ఇనుమడింప చేసేందుకు అన్నమయ్య వంశీకులు చేసిన సేవలు నిరుపమానమన్నారు. అన్నమయ్య వర్ధంతిని ఆదివారం తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. వారం రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, తిరుచానూరులోని ఆస్థానమండపం, తాళ్లపాక, దేవుని కడప వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు.
ముందుగా ఆలిపిరి పాదాల మండపం వద్ద మేడసాని మోహన్, అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించారు. మెట్లోత్సవంలో రెండు వేల మందికి పైగా కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వీరు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ తిరుమలగిరులను అధిరోహించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వాణి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.