RATHOTSAVAM _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి రథోత్సవం
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి రథోత్సవం
తిరుపతి, మార్చి 8, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్టాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.
కాగా ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.
కాగా బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం ఉదయం 10.40 గంటలకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి జె.కృష్ణకుమారి హరికథ వినిపించారు. సాయంత్రం డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఆధ్యాత్మికోపన్యాసం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి ఆర్.బుల్లెమ్మ అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివి అండ్ ఎస్వో శ్రీ జివిజి.అశోక్కుమార్, డెప్యూటీ ఈవో శ్రీమతి రెడ్డెమ్మ, ఏఈవో శ్రీ లక్ష్మణ్ నాయక్, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రఘునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.