ఆగస్టు 5, 6వ తేదీల్లో వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు
ఆగస్టు 5, 6వ తేదీల్లో వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు
తిరుపతి, 2022 ఆగస్టు 04: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.
తరిగొండలో…
వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలో…
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 5వ తేదీన ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుమలలో…
ఆగస్టు 6వ తేదీ ఉదయం 11.30 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టిటిడి ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.