తిరుమలలో పల్స్పోలియో నిర్వహణ
తిరుమలలో పల్స్పోలియో నిర్వహణ
తిరుమల, 20 జనవరి 2013: ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్పోలియో నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా తిరుమలలో తి.తి.దే ఆధ్వర్యంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు సివిల్ సర్జన్ డా|| ఎన్.వికాస్ నేతృత్వంలో శ్రీవారి ఆలయం ముందు చంటిబిడ్డలకు పల్స్పోలియో చుక్కలువేసి లాంఛనంగా ప్రారంభించారు.
కాగా అశ్విని ఆసుపత్రి నేతృత్వంలో తిరుమలలో 23 పల్స్ పోలియో కేంద్రాలు, 2 మోబైల్ పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో అశ్విని, జి.యన్.సి, ఆర్.టి.సి బస్టాండ్, సి.ఆర్.ఓ, హెల్త్ ఆఫీసు, కె.కె.సి, పి.ఏ.సి-1, పి.ఏ.సి-2, యప్.టైప్ క్వార్టర్స్, బాలాజీ నగర్లో రెండు కేంద్రాలు, యస్.వి.హైస్కూల్, తి.తి.దే ఉద్యోగుల డిస్పెన్సరి, రాంభగీచా-||| వద్ద ఒక కేంద్రం, శ్రీవారి ఆలయంలోపల ఒకటి, వాహనమండపం చెంత ఒకటి, వరాహస్వామి అతిథి గృహం, మేదరమిట్ట, వైకుంఠం-1,2, సుపథం, యం.బి.సి-26, పాపవినాశనం చెంత పల్స్పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయగా, రెండు మొబైల్ కేంద్రాలను అలిపిరి కాలిబాట చెంత ఒకటి, రద్దీ ఉన్న విడిది గృహాల చెంత మరొకటి ఏర్పాటు చేసినట్లు డా|| వికాస్ తెలిపారు. ఈ కేంద్రాలలో 17 కేంద్రాలు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయగా మిగిలిన 8 కేంద్రాలను స్థానికుల కొరకు తి.తి.దే ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
ఈ కేంద్రాలలో జనవరి 20 మరియు ఫిబ్రవరి 24 తారీఖుల్లో ఉదయం 7.00 గం||ల నుండి సాయంత్రం 6.00 గం||ల వరకు 0-5 ఏళ్ళ లోపు చంటి పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేయటం జరుగుతుందని, ఈ అవకాశాన్ని భక్తులు మరియు స్థానికులు సద్వినియోగం చేసుకొని పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఇక జనవరి 21,22 తేదీలలో తిరుమలలో ఇంటింటా మాపింగ్ నిర్వహించి పోలియోచుక్కలు వేసుకోనటువంటి పిల్లలకు కూడా విధిగా వేయటం జరుగుతుందని ఆయన అన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.