Valedictory function of Training Classes in “IDOL WORSHIP” for members of Girijan community _ బ్రాహ్మణేతరులు అర్చకత్వం నేర్చుకోవడానికి అర్హులే :ధర్మప్రచారపరిషత్ కార్యదర్శి కవితా ప్రసాద్
బ్రాహ్మణేతరులు అర్చకత్వం నేర్చుకోవడానికి అర్హులే :ధర్మప్రచారపరిషత్ కార్యదర్శి కవితా ప్రసాద్
తిరుపతి, డిశెంబర్-01, 2009: కులాలకు అతీతంగా బ్రాహ్మణేతరులు అర్చకత్వం నేర్చుకోవడానికి అర్హులేనని తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మప్రచారపరిషత్ కార్యదర్శి కవితా ప్రసాద్ అన్నారు.
తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి విచ్చేసిన 50 మంది గిరిజనులకు అర్చకత్వంపై శిక్షణాతరగతులను నిర్వహించారు. మంగళవారం సాయంత్రం శ్వేత భవనములో జరిగిన అర్చకత్వ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిపిపి సెక్రటరీ కవితాప్రసాద్ మాట్లాడుతూ భగవంతుని దృష్ఠిలో సర్వజనులు సమానమేనని దేవుడుని పూజించుటకు కులాలు అర్హత కానే కాదని స్పష్ఠం చేశారు. పూజారులు భగవంతునికి, భక్తులకు వారదిలాంటి వారని అన్నారు. శ్వేతలో అర్చకత్వంపై శిక్షణ పొందిన గిరిజనులు తమ తమ గ్రామాలలోని ఆలయాలలో పూజలు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఒత్తిడిలో నిర్ణయాలు, కోపంలో మాటలు, సంతోషంలో వాగ్ధానాలు చేయకూడదని బోధించారు.
అనంతరం శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి తితిదే బ్రాహ్మణేతరులకు అర్చకత్వంపై శిక్షణ ఇస్తున్నదని స్పష్టం చేశారు. శిక్షణపొందిన గిరిజనులు శుచి,శుభ్రతను పాటిస్తూ పూజా విధాన కైంకర్యాలను నిబద్దతతో పాటించాలని సూచించారు.
అనంతరం అర్చకత్వంపై శిక్షణపొందిన గిరిజనులకు పూజా సామాగ్రి, నూతన వస్త్రాలు, శ్రీవారి చిత్రపటం, తితిదే క్యాసెట్లు, సీడిలు, ప్రచురణలతోపాటు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.