CM RELEASES BOOK _ ముఖ్యమంత్రి చేతులమీదుగా పలు ఆవిష్కరణలు
ముఖ్యమంత్రి చేతులమీదుగా పలు ఆవిష్కరణలు
తిరుమల, 2012 సెప్టెంబరు 18: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం సాయంత్రం నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నల్లారి కిరణ్కుమార్రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు ఆవిష్కరణలు చేశారు. ఇందులో ”తిరుమల ఆనంద నిలయ శాసనాలు” అనే పుస్తకం, ”తిరుమల తీర్థాలు”, ”శ్రీవారికి కానుకగా అందిన నాణేల వైశిష్ట్యం” అనే కరపత్రాలు ఉన్నాయి.
పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా తిరుమలక్షేత్రం చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. ఎందరెందరో ఆచార్య పురుషులు, చక్రవర్తులు, మహరాజులు, సామంతులు, దండనాయకులు, మంత్రులు, అధికారులు, సామాన్య భక్తులు తమ శక్తికి తగినట్లుగా స్వామివారికి అనేక దానాలను సమర్పించి, వాటి వివరాలను శాసనాలుగా చెక్కించారు. ఈ శాసనాలు ఆనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు మత విధానాలను మనకళ్లకు కట్టినట్లు చూపుతాయి. శ్రీవారి గర్భగుడి ఆనందనిలయం వెలుపల గోడల మీద తెలుగు, తమిళ, కన్నడ మరియు సంస్కృత భాషలలో అనేక శాసనాలు లిఖించబడ్డాయి. ఈ శాసనాలను భక్తులకు, పరిశోధకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పుస్తకం రూపొందించడం జరిగింది.
”తిరుమల తీర్థాలు” అనే కరపత్రంలో తిరుమల కొండకోనల్లో ఉన్న పలు దివ్యతీర్థాల గురించి వివరించారు. స్వామి పుష్కరిణీ తీర్థం, శంఖుతీర్థం, చక్రతీర్థం, జాబాలీతీర్థం, పాండవతీర్థం, ఆకాశగంగ, పాపవినాశన తీర్థం, సనకసనంద తీర్థం, రామకృష్ణ తీర్థం, తుంబురు తీర్థం, కుమారధార, శేషతీర్థం గురించి ఇందులో తెలియజేశారు.
”శ్రీవారికి కానుకగా అందిన నాణేల వైశిష్ట్యం” కరపత్రంలో పలు రాజవంశాల కాలం నాటి నాణేల గురించి క్లుప్తంగా వివరించారు. ఇందులో క్రీ.శ ఒకటో శతాబ్దం కాలం నాటి రోమన్ నాణేం, హోయసాల రాజవంశానికి చెందిన రాజు విష్ణువర్ధన కాలం నాటి నాణేలు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు, ఆరవీడు రాజవంశ పాలన కాలం నాటి నాణేలు తదితర నాణేల గురించి తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.