ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

తిరుపతి, మే 6, 2013: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే సోమవారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ సి.హెచ్‌.ఈశ్వర్‌ శర్మ ”భక్త నందనార్‌” అంశంపై హరికథా పారాయణం చేశారు. సాయంత్రం 6.00 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ శ్రీమతి కె.వాణి ”అన్నమయ్య సంకీర్తనల్లోని శ్రీ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై ఉపన్యసించ నున్నారు. రాత్రి 7.00 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి రమణివాణి సంగీత సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య, రీసర్చ్‌ అసిస్టెంట్‌ శ్రీమతి లత, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.