జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుపతి, జూన్‌ 15, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. ఈ ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షసుఖం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగారి మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తుందని ఈ తెప్పోత్సవాల అంతరార్థం.
జూన్‌ 19వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. ఈ మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అమ్మవారికి జూన్‌ 22వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహనం, 23వ తేదీ రాత్రి గరుడ వాహనసేవలు జరుగను న్నాయి. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, లక్ష్మీపూజ ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.
    
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.