జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమల, 2012 జూలై 09: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 16వ తేదీ సోమవారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానమును తితిదే ఘనంగా నిర్వహించనుంది.

సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు జరుపబడుతుంది. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరిరోజున జరుపబడే కొలువు కనుక ఈ ఉత్సవానికి ఆణివార ఆస్థానం అనిపేరు.
చారిత్రక నేపథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి తితిదే వారి ఆదాయ వ్యయాలు, నిలువలు, మున్నగు వార్షిక లెక్కలు ఈ రోజు నుండే ప్రారంభమయ్యేవి. అయితే తితిదే ధార్మిక మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి-ఏప్రిల్‌ నెలలకు మార్చడం జరిగింది. అయినా శ్రీవారి ఆలయంలో ఈ వార్షిక సాలకట్ల ఉత్సవం నిరంతరాయంగా సౌరమానాన్ని అనుసరించి జరుగుతుండడం విశేషం.

ఈ సందర్భంగా తితిదే సోమవారం నాడు తోమాల, అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. అయితే ఒక్క సుప్రభాత సేవ మినహా తితిదే మిగిలిన సేవలను ఏకాంతంలో నిర్వహిస్తుంది.

అనంతరం ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల నడుమ బంగారువాకిలి ముందుగల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యకక్షుడైన విష్వక్సేనులవారి దక్షణాభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టునకు, బంగారువాకిలి దగ్గర ఆస్థానంలో వేంచేపు చేసివున్న ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.

అనంతరం తిరుమల పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో మడతపెట్టినటువంటి ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలమీద పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ తిరుమల చిన్న జీయంగార్‌, తితిదే ఈఓ, జెఈఓ, ఇతర ఉన్నతాధికారులు మొదలైనవారితో కూడి వెంటరాగా స్వామివారి మూలవిరాట్టుకు ఈ వస్త్రాలను సమర్పిస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.

అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. అటు తరువాత అర్చకులు పెద్ద జీయంగారికి, చిన్న జీయంగారికి తితిదే తరపున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించి హారతి, చందన, తాంబూల, తీర్థ, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులందరి దగ్గర ఒక్కొక్క రూపాయి వసూలు చేసి దానితో రూపాయి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇలా జమయిన రూపాయలను తితిదే ఈఓ సమక్షంలో ఖజానాకు జమ చేయడం జరుగుతుంది.

అనంతరం సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారు ఉభయనాంచారులతో కూడి తిరుమల పురవీధుల గుండా అత్యంత శోభాయమానంగా అలంకరింపబడిన పుష్పపల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.