తి.తి.దే పరిపాలనా భవనంలో కార్యనిర్వహణాధికారి కో-ఆర్డినేషన్ సమావేశం
తి.తి.దే పరిపాలనా భవనంలో కార్యనిర్వహణాధికారి కో-ఆర్డినేషన్ సమావేశం
తిరుపతి, జనవరి-31,2009: తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ శాఖలు, శాఖాధికారుల మధ్య మంచి సమన్వయం యుండాలని, సమన్యయం కొరవడితే పనులు వేగవంతంగా జరుగవని తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. శనివారంనాడు తి.తి.దే పరిపాలనా భవనంలో జరిగిన అధికారుల కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆయన వివిధశాఖల పని తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో 22వ తేదిన రాష్ట్రమంతటా విద్యార్థులకు సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు తి.తి.దే నిర్వహిస్తున్నదని, యీ పరీక్షలలో దాదాపు లక్షమందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశముందని, అదే విధంగా ఫిబ్రవరి నెలలోనే 28వ తేదిన తిరుమలలో సనాతన ధార్మిక ప్రచార సదస్సు కూడా నిర్వహిస్తున్నామని, ఈ రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
తిరుమలలో దేవదేవుని పూజకు తులసివనం అవసరమని, దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో యీ వనాన్ని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా తిరుచానూరులో కూడా ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని, తిరుమలలో అన్నదానం కాంప్లెక్స్లో లిప్టులను, అన్ని వివరాలతో సైన్ బోర్డులను ఎక్కువ సంఖ్యలో యేర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. తి.తి.దేవస్థానంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న మహిళా అధికారులకు మహిళాదినోత్సవం రోజున ప్రశంసా పత్రాలు అందజేసే ఆలోచన యుందని శ్రీ రమణాచారి అన్నారు.
తిరుమల ప్రత్యేకాధికారి శ్రీఎ.వి.ధర్మారెడ్డి, ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీరమణకుమార్, ఛీఫ్ ఇంజనీర్ వి.ఎస్.బి.కోటేశ్వరరావు, జనరల్ మేనేజర్ పి.వి.శేషారెడ్డి, ముఖ్యగణాంకాధికారి ఓ. బాలాజి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి ఇ.ఓ. ఆర్.ప్రభాకర్ రెడ్డి, డిప్యూటి ఇ.ఓ. సర్వీసెస్ టి.ఎ.పి.నారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీచంథ్రేఖర్ రెడ్డి, డి.పి.పి.సెక్రటరీ డా|| విజయరాఘవాచార్యులు, ఆరోగ్యశాఖ అధికారి డా||విజయలక్ష్మి మరియు యితర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.