DISPLAY OF VARIED ART FORMS DURING NAVARATRI BRAHMOTSAVAMS- TTD JEO (H&E) SMT SADA BHARGAVI _ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విభిన్న కళారూపాలు – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విభిన్న కళారూపాలు – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2023 అక్టోబర్ 07: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయని, వాహనసేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విభిన్న కళారూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారులతో జేఈవో శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళాప్రదర్శనలకు మంచి స్పందన లభించిందని, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. రోజువారీగా ఏయే ప్రాంతం నుండి కళాబృందాలు వస్తున్నాయి, ఎలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారనే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మిజోరం, మణిపూర్ తదితర రాష్ట్రాల నుండి కళాబృందాలు వస్తున్నట్టు జేఈవో తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ట్రాన్స్పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.