బాంబుల నిర్వీర్యంలో తితిదే భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

బాంబుల నిర్వీర్యంలో తితిదే భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

తిరుమల, జూన్‌ 03, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా మరియు భద్రతా విభాగానికి చెందిన 30 మంది సిబ్బందికి బాంబులు, పేలుడు పదార్థాలు, వాటికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై 27 రోజుల పాటు హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ పొందారు.
 
గత నెల 6వ తారీఖు నుండి ఈ నెల ఒకటో తారీఖు వరకు హైదరాబాదులోని మొయినాబాద్‌లో గల ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నేతృత్వంలో ఈ భద్రతా సిబ్బంది సంపూర్ణ శిక్షణ పొందారు. తద్వారా వీరు అధునాతనమైన పేలుడు పదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బాంబులను కనిపెట్టడం, బాంబులను నిర్వీర్యం చేయడానికి ఉపయోగించే అధునాతన పరికరాల గురించి శిక్షణ పొందారు.
 
ఈ సందర్భంగా తితిదే సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ శిక్షణ పొంది తిరిగివచ్చిన సిబ్బందిని అభినందించారు. త్వరలో తితిదే కొనుగోలు చేయనున్న బాంబు నిర్వీర్య అధునాతన పరికరాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కాగా ఈ శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన శ్రీ ఎల్వీ రమణ, శ్రీ కె.అమరనాథ్‌, శ్రీ కె.బాలకృష్ణ మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
 
ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్‌ఓ శ్రీ టి.వి.శివకుమార్‌రెడ్డి, తిరుపతి నిఘా మరియు భద్రతాధికారి శ్రీ వి.హనుమంతు కూడా ఉన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.