ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు

ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 16: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు స్వామివార్లకు వస్త్ర బహుమానం, అక్షతారోహణ, ఆణివార ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. రాత్రి 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు పూర్ణాహుతి, ఉత్సవమూర్తులు, ప్రధాన కుంభం విమాన ప్రదక్షిణముగా సన్నిధికి చేర్చుట, కుంభావాహన, విశేష నివేదన, ఆచార్య అర్చక బహుమానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర్‌పిళ్లై, సూపరింటెండెంట్‌ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ సుందరం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.