మే 28 నుండి 30వ తేదీ వరకు  శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

మే 28 నుండి 30వ తేదీ వరకు  శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి, మే 27, 2013:  శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 28 నుండి 30వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు అంటే మే 28, 29వ తేదీల్లో మలయప్పస్వామి ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీసత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.
కాగా ప్రతిరోజూ మధ్యాహ్నం స్నపనతిరుమంజనం, సాయంత్రం ఊంజలసేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, స్వరపుష్పార్చన సేవ, సహస్త్రకలశాభిషేకం, తిరుప్పావడ సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.