శ్రీ వరాహస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణలో విశేష హోమాలు
శ్రీ వరాహస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణలో విశేష హోమాలు
తిరుమల, 2020 డిసెంబరు 07: తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలలో భాగంగా సోమవారం విశేష హోమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, పంచగవ్యారాధన నిర్వహించారు. తరువాత ఉక్త హోమాలు, మూర్తి హోమం, శాంతి హొమం, వాస్తు హోమం, అంగ హోమం, అధివాస హోమాలు జరిగాయి.
కాగా, సోమవారంనాడు ఉదయం బాలలయంలో ఉండే స్వామివారి దారు బింబమునకు అక్షియా మోచనం (దృష్ఠి పెట్టడం) చేసి గో దర్శనం కల్పించారు. అనంతరం ఎదురు ఆంజనేయస్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్యకారులవారికి, విమాన గోపురం నమూనాకు అక్షియా మోచనం చేసి, ఎదురు ఆంజనేయ స్వామివారిని ఆవుతో కదిలించారు.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్ఎకె.సుందరవరదచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవిందరాజ దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.