సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ వరకు మహతిలో హరికథా సప్తాహ మహోత్సవం

సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ వరకు మహతిలో హరికథా సప్తాహ మహోత్సవం

తిరుపతి, ఆగస్టు  23, 2013: హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమద్‌ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 149వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హరికథా సప్తాహ మహోత్సవం వైభవంగా జరుగనుంది. తితిదేకి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ నారాయణదాస సాహిత్యంపై సదస్సులు, ప్రముఖ పండితుల ఉపన్యాసాలు, సీనియర్‌ హరికథ కళాకారులకు సన్మానాలు, హరికథాగానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 4న శ్రీ నారాయణదాసవర్యుల జయంతి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన శిలావిగ్రహావిష్కరణ ఘనంగా జరుగనుంది. సుప్రసిద్ధ తెలుగు చిత్ర దర్శకులు డాక్టర్‌ కె.విశ్వనాథ్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వళ్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.