PERFORM SPIRITUAL PROGRAMMES WITH SOCIAL FACE-CDAC CHAIRMAN _ ప్రతి జిల్లాలో ధార్మిక శిక్షణ కార్యక్రమాలు : కేంద్రీయ ధార్మిక సలహామండలి అధ్యకక్షులు శ్రీ రాంబాబు
ప్రతి జిల్లాలో ధార్మిక శిక్షణ కార్యక్రమాలు : కేంద్రీయ ధార్మిక సలహామండలి అధ్యకక్షులు శ్రీ రాంబాబు
తిరుపతి, 2012 అక్టోబరు 3: సనాతన హైందవ ధర్మ వ్యాప్తి కోసం విశాలమైన దృక్పథంతో కార్యక్రమాలు రూపొందించా లని, ప్రతి జిల్లాలో ధార్మిక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కేంద్రీయ ధార్మిక సలహా మండలి అధ్యకక్షులు శ్రీ రాంబాబు తితిదేకి సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం కేంద్రీయ ధార్మిక సలహామండలి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ రాంబాబు మాట్లాడుతూ ధర్మప్రచారాన్ని మిళితం చేసి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అణగారిన వర్గాలు నివసించే ప్రాంతాల్లో ముఖ్యంగా దళితవాడల్లో భజన మందిరాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామదేవత పూజావిధానాలపై పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాలని కోరారు. తితిదే ప్రస్తుతం చేపడుతున్న అర్చక శిక్షణ విధానాన్ని సమీక్షించాలని సూచించారు.
ఆగస్టు 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మనగుడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవంబరు 28వ తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న రెండో విడత మనగుడి కార్యక్రమాన్ని భక్తుల భాగస్వామ్యంతో ఏవిధంగా జయప్రదం చేయాలనే విషయాలపై కూలంకషంగా చర్చించారు. రెండో విడత మనగుడి విజయవంతానికి ప్రణాళికాబద్ధంగా కరపత్రాలు, వాల్పోస్టర్లు సిద్ధం చేయాలని కోరారు. ఇందులో భాగంగా గోపూజ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, హనుమంత దీక్ష, లక్ష్మీపూజ, కుంకుమార్చనలు, నాగులచవితి రోజు కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
అదేవిధంగా నవంబరు 19వ తేదీన ఎంపిక చేసిన ఆలయాల్లో లక్ష్యబిల్వార్చన నిర్వహించాలని శ్రీ రాంబాబు సూచించారు. నవంబరు 25వ తేదీన 1058 మండలాల్లో కైశికద్వాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు గోవింద నామావళిని పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన సలహామండలి సమావేశాల్లో ఇచ్చిన సూచనలు, సలహాలపై తీసుకున్న చర్యలతో కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాథ్, జస్టిస్ భాస్కర్రావు, శ్రీ వీరభద్రయ్య, శ్రీ పొత్తూరు వేంకటేశ్వరరావు, శ్రీ విఠల్రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.